
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణ్పూర్, కొండగావ్ బార్డర్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఐజీ సుందర్రాజ్ పి నేతృత్వంలో బలగాలు మంగళవారం సాయంత్రం కూంబింగ్ చేపట్టాయి. కిలం-బర్గూం అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ కు మావోయిస్టులు తారసపడ్డారు. పోలీస్బలగాలపై కాల్పుల జరుపుతూ మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.
అనంతరం భద్రతా దళాలు ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యుడు, ఆమ్దాయి ఏరియా కమిటీ కమాండర్ హల్దర్ కశ్యప్, ఆమ్దాయి ఏరియా కమిటీ మెంబర్ రామే సోరీ అలియాస్ రాములుగా వారిని గుర్తించారు. హల్దర్పై రూ.8లక్షలు, రామేపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ తెలిపారు. ఏకె-47, ఆటోమెటిక్ వెపన్, విప్లవ సాహిత్యం, మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్లు, ఇతర పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది 148 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు.